గాంధీ గర్భిణీ, శిశు మరణాలపై కేటీఆర్ వెర్సస్ రాజనర్సింహా * ఎక్స్ లో డైలాగ్ వార్
గాంధీ గర్భిణీ, శిశు మరణాలపై
కేటీఆర్ వెర్సస్ రాజనర్సింహా
* ఎక్స్ లో డైలాగ్ వార్
సికింద్రాబాద్, సెప్టెంబర్ 18 (ప్రజామంటలు):
గాంధీఆస్పత్రిలో గర్భిణీ, శిశుమరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ హెల్త్ మినిస్టర్ మంత్రి దామోదర రాజనర్సింహాల మధ్య ఎక్స్ (ట్విట్టర్) వేదికగా డైలాగ్ వార్ జరిగింది. 48 మంది పసిగుడ్డులు, 14 మంది బాలింత తల్లులు.. ఊహించుకుంటేనే ఒళ్లు జలధరిస్తోంది.. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ? వ్యవస్థలు పనిచేస్తున్నాయా ? అని కేటీఆర్ ట్విట్టర్లో ప్రశ్శిస్తే, ప్రభుత్వ దవఖానాలను నాశనం చేసే కుట్రలు మానుకో కేటీఆర్.. అంటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఘాటుగా సమాధానం ఇచ్చారు.
పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా, తల్లుల గర్భశోకానికి జవాబు ఉండదా... కేటీఆర్
ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీఆస్పత్రిలో ఇంత విషాదం ఎవరి పాపం? పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా, తల్లుల గర్భశోకానికి జవాబు ఉండదా, తప్పు చేయకపోతే సర్కార్ ఈ లెక్కలను ఎందుకు దాస్తోంది, ఆ తల్లీబిడ్డల ఉసురు మీకు తగలదా, గాంధీలోనే ఇన్ని మరణాలుంటే రాష్ట్రంలోని పరిస్థితి ఊహించుకుంటే భయంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు, డెలివరీ అయితే కేసీఆర్ కిట్, సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇస్తు తల్లిబిడ్డలను ఇంటివద్దకు దిగబెట్టి వచ్చేలా కేసీఆర్ వ్యవస్థలను తయారుచేశారు, అది ఓ పాలకుడిగా ప్రజల బాధ్యత తీసుకోవడం, మరి మన చీప్ మినిస్టర్ ఏం చేస్తున్నారో.. పాలన గాలికి వదిలి, ప్రచార ఆర్భాటాలు, విగ్రహ రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుందని విమర్శించారు. గాంధీఆస్పత్రి ఫొటోతోపాటు గర్భిణీలు, శిశువుల మరణాల జాబితాను పోస్ట్ చేసి, తక్షణమే తెలంగాణ సీఎస్ స్పందించి ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.
నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఖబద్ధార్ కేటీఆర్ ... వైద్యమంత్రి దామోదర రాజనర్సింహా
కార్పోరేట్ ఆస్పత్రులకు కొమ్ముకాస్తు, గరీబోళ్లు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆస్పత్రులను నాశనం చేస్తు, ప్రభుత్వ వైద్యం, వైద్యులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఖబద్ధార్ కేటీఆర్ అంటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. గాంధీ ఆస్పత్రిపై బురదజల్లి వైద్యం కోసం వచ్చే నిరుపేదల మనోథైర్యం దెబ్బతీయడం బాధాకరమన్నారు. గాంధీ వంటి ఆస్పత్రులకు అత్యంత విషమంగా ఉన్న రోగులు చివరి నిమిషంలో వస్తారు, వారిని బ్రతికించేందుకు వైద్యులు ఎంతో కష్టపడతారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో కొన్ని మరణాలు సంబవిస్తాయి. కాంగ్రెస్ వచ్చాకే మరణాలు జరిగాయంటు నంబర్లను భూతద్ధంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ ఆజ్ఞానం, కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాసే సహజగుణానికి ఆయన మాటలు అద్దం పడుతున్నాయన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేసేందుకు యత్నిస్తే ప్రజలే సరైనరీతిలో బుద్ధి చెబుతారని, గాంధీ దవఖానాకు వచ్చేది దొరజనం కాదు, నా జనం.. నేను కూడా గాంధీఆస్పత్రిలోనే పుట్టాను, నా జనాల బాగోగులు చూసుకునే బాధ్యత నాదే, బీఆర్ఎస్ కుట్రలను నమ్మి భయపడకండి, ప్రభుత్వ ఆస్పత్రులకు ధైర్యంగా వచ్చి వైద్యసేవలు పొందండి, బీఆర్ఎస్ నాశనం చేసిన వైద్యవ్యవస్థను గాడిన పెడుతున్నామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహా ఘాటుగా స్పందించారు.