గురుకుల పాఠశాలలను మరింత అభివృద్ధి చేస్తాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గురుకుల పాఠశాలలను మరింత అభివృద్ధి చేస్తాం
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కోరుట్ల ఆగస్టు 13 :
విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా మెటుపల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సందర్శించారు.
ఇటీవల పాముకాటుతో మరణించిన విద్యార్థి తల్లిదండ్రులతో పాటు అస్వస్థతకు గురైన విద్యార్థి తల్లిదండ్రులను భట్టి విక్రమార్క పరామర్శించారు.
బాధిత కుటుంబాలకు వారి రెసిడెన్స్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
గురుకుల పాఠశాల ఆవరణను పరిసర ప్రాంతాలను ఆయన పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు.
పాఠశాలలో ఉన్న వసతులు ఇతర మౌలిక సదుపాయాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇకపై ప్రతి గురుకుల పాఠశాలల్లో ఈ యాంటీ స్నేక్ వెనం, యాంటీ రేబీస్, టీకాలతో పాటు పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు.
ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రతి పాఠశాలను స్వచ్ఛంగా ఉంచడంతో పాటు పాఠశాల ఆవరణలో పండ్ల మొక్కల పెంపకానికి చర్యలు చేపడతామని ఆయన అన్నారు.
ప్రతి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ ప్రతి వారి పరిధిలో ఉన్న గురుకుల పాఠశాలలో నెలకు ఒక్కసారైనా భోజనం చేయాలని ఆయన సూచించారు.
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి అత్యంత బాధాకరమని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తల్లిదండ్రులకు ఆయన భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో పాటు ఇతర అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.