హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మ‌ద్రాస్ హైకోర్టు సూచనలు

On
హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మ‌ద్రాస్ హైకోర్టు సూచనలు

హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మ‌ద్రాస్ హైకోర్టు సూచనలు

చెన్నయ్ అక్టోబర్ 03:

ఆలయాల్లోకి హిందూయేత‌ర ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ప్ర‌క‌టించింది. త‌మిళనాడులోని అన్ని దేవాలయాల్లోకి హిందూయేతరులను ఆయా పుణ్యక్షేత్రాల ధ్వజస్తంభం దాటి అనుమతించరాదంటూ కీల‌క ఉత్తర్వులు జారీ చేసింది.

హిందువులకు కూడా తమ మతం, వృత్తిని అభ్యసించే ప్రాథమిక హక్కు ఉందని పేర్కొంటూ ప్ర‌తి దేవాల‌యం బ‌య‌ట బోర్డులను ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఆదేశాలు జారీ చేశారు.

త‌మిళ‌నాడులోని ప్ర‌సిద్ధిచెందిన అరుల్మిగు పళని దండాయుతపాణి స్వామి ఆలయం, దాని ఉప ఆలయాల్లోకి కేవ‌లం హిందువుల‌కు మాత్ర‌మే అనుమ‌తించాలంటూ దానికోసం ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డి సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేయ‌డం జ‌రిగింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మధురై ధ‌ర్మాస‌నం హిందు ఆల‌యాల్లోకి అన్యమతస్థుల ప్రవేశంపై అన్నిఆలయాల ప్రవేశ ద్వారాలలో ప్రత్యేక బోర్డుల‌ను ఏర్పాటు చేయాల‌ని కోరింది. ఆలయ ప్రవేశ ద్వారం ద‌గ్గ‌ర‌ ధ్వజస్తంభం దగ్గర, మందిరంలోని ప్రముఖ ప్రదేశాల్లో 'హిందూయేతరులను అనుమతించరు' అనే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించ‌డం జ‌రిగింది.

ఈ పిటిష‌న్‌లో ప్ర‌తివాదులుగా తమిళనాడు పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పళని ఆలయ కార్యనిర్వాహక అధికారిని చేర్చ‌డం జ‌రిగింది. ఎందుకంటే, తమిళనాడులోని హిందూ ఆలయాలను పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తుంది.

 
 

ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు వర్తిస్తుందన్న కోర్టు :'

హిందూ ఆల‌యాల్లోకి ఇత‌ర మ‌తాల వారిని అనుమ‌తించ‌వ‌ద్ద‌ని ప్రతివాదులకు సూచించడం జ‌రిగింది. ఎవరైనా హిందుయేతరులు హిందూ దేవ‌త‌ల‌ను దర్శించుకోవాలంటే,దేవతపై విశ్వాసం, హిందూ మతం ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తానని, ఆలయ ఆచారాలకు కూడా కట్టుబడి ఉంటాన‌ని వారి నుంచి హామీ పొందాలి. హామీ ఇచ్చిన వారినే ఆలయాన్ని సంద‌ర్శించాడానికి అనుమ‌తించాల‌ని మ‌ద్రాసు కోర్టు పేర్కొంది. వారు ఆల‌యాల‌ను సంద‌ర్శించిన‌ప్పుడు త‌ప్ప‌కుండా ఆలయ రిజిస్టర్‌లో పేరు నమోదు చేయాలని కూడా స్ప‌ష్టం చేయ‌డం జ‌రిగింది.

'ఆలయ నియమాలు, ఆచారాలు, ఆలయ అభ్యాసాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ఆలయ ప్రాంగణాన్ని నిర్వహించాలి' అని మ‌ద్రాసు ధ‌ర్మాస‌నం పేర్కొన‌డం జ‌రిగింది. ఈ పిటిషన్ కేవ‌లం పళని దేవాలయానికి మాత్రమే దాఖలు చేయడంతో కోర్టు ఉత్తర్వులు దానికి మాత్రమే పరిమితం కావచ్చని ప్రతివాదులు చేసిన వాదనను మ‌ద్రాసు కోర్టు కొట్టిపారేసింది.ఇది త‌మిళ‌నాడు రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలకు వర్తిస్తుంది. అందువల్ల త‌మిళ‌నాడు రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఆర్‌ అండ్‌ సీఈ విభాగం, ఆలయ నిర్వహణలో పాలుపంచుకున్న వ్యక్తులందరూ అన్ని హిందూ దేవాలయాలు ఈ ఆదేశాల‌ను పాటించాలని స్పష్టం చేస్తున్నాం అని మ‌ద్రాసు కోర్టు పేర్కొంది.

Tags