ఐక్యంగా పోరాడి దక్షిణాది వాటా సంపాదించుకోవాలి - సిఎం రేవంత్ రెడ్డి
చెన్నై మార్చ్ 22:
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి తమ వాటా దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పునర్విభజన ప్రక్రియపై రాష్ట్ర శాసనసభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగతా రాష్ట్రాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలో నిర్వహించిన Fair Delimitation (న్యాయమైన పునర్విభజన) జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించే పునర్విభజనపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
✳️ పునర్విభజన అంశంలో సమావేశంలో అనేక కీలక అంశాలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి, దీనిపై ఐక్య కార్యాచరణ కోసం త్వరలో హైదరాబాద్లో తదుపరి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. దక్షిణ భారతదేశ పౌరుల గళాన్ని బలంగా, ఐక్యంగా మొత్తం భారత దేశానికి వినిపిద్దామని పిలుపునిచ్చారు.
✳️ “నియోజకవర్గాల పునర్విభజనపై మనందరిని ఏకతాటిపై తెచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు ప్రత్యేక అభినందనలు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నా.
✳️ 1971లో జనాభా నియంత్రణ పాటించాలని దేశం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేశాయి. ఉత్తరాది పెద్ద రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి.
✳️ కేంద్ర ఖజానాకు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ, తిరిగి తక్కువ మొత్తాన్ని పొందుతున్నాం. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే తిరిగి 29 పైసలే వెనక్కి వస్తుంది. ఉత్తర ప్రదేశ్కు 2.73 రూపాయలు వెనక్కి వెళుతున్నాయి. బీహార్ రూపాయి చెల్లిస్తే 6.06 రూపాయలు వెనక్కి వెళుతున్నాయి. కర్ణాటకకు కేవలం 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయి. అదే సమయంలో మధ్య ప్రదేశ్ రూపాయి పన్ను రూపంలో కేంద్రానికి ఇస్తే వెనక్కి రూ.1.73 పైసలు వెళుతున్నాయి.
✳️ దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్ను చెల్లింపులు క్రమంగా తగ్గిస్తోంది. చివరకు జాతీయ ఆరోగ్య మిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకు 60 నుంచి 65 శాతం నిధులు దక్కుతున్నాయి.
✳️ మనది ఒకే దేశం. మనం దానిని గౌరవిస్తాం. కానీ ఈ నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించం. ఎందుకంటే రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను కుదించడమే. మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలను ఈ ప్రక్రియ ద్వారా శిక్షిస్తోంది. ఈ అసమగ్రమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా అడ్డుకోవలసిన అవసరం ఉంది.
▶️ ముఖ్యంగా..
✳️ 1). సీట్లు పెంచొద్దు. ఉన్న సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలి. 1976లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ రకంగానే పునర్విభజన చేపట్టారు. లేదంటే రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానతలు ఏర్పడేవి. 2001లో ప్రధానమంత్రి వాజ్పేయి గారి నేతృత్వంలోని ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను కూడా ఇదే రకంగా చేపట్టారు. లోక్సభ సీట్లను అదే సంఖ్యలో ఉంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదే విధంగా చేయగలరా?
✳️ 2). జనాభా దామాషా ప్రాతిపదికను పునర్విభజన దక్షిణాది వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న జనాభా దామాషా పద్దతిలో పునర్విభజనను చేపడితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ గళం కోల్పోతాయి. దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాదిలో ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించిబడుతుంది.
✳️ జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చలాయిస్తాయని అందరూ అంగీకరిస్తున్నారు. ఏ పరిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదనను అంగీకరించకూడదు.
✳️ 3) ప్రొరేటా విధానాన్నీ అంగీకరించలేం. ప్రొరేటా విధానం కూడా దక్షిణాదికి నష్టమే కలగజేస్తుంది. ప్రొరేటా ప్రక్రియ కూడా రాజకీయ అంతరాలను పెంచుతుంది. ప్రొరేటా విధానాన్ని పాటిస్తే సీట్ల మధ్య తేడా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయిస్తుంది. ఒక్క సీటు కూడా కేంద్రంలో ప్రభుత్వాలను నిర్ధేశించగలదు. దేశంలో ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర మన అనుభవంలో ఉంది.
▶️ ఆమోదయోగ్య ప్రతిపాదనలు
✳️ మరో 25 ఏళ్లపాటు లోక్సభ సీట్లలో ఎటువంటి మార్పు తీసుకురావద్దు. సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలి. పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని చేయాలి. రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలి.
✳️ రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల హద్దులను మార్పు చేయాలి. తాజా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలి. ప్రతి రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. లోక్ సభ స్థానాల పెంపును మరో 25 ఏళ్లపాటు వాయిదా వేయాలి.
✳️ జనాభా నియంత్రణలో ప్రగతి సాధించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వస్తి చెప్పాలి. జనాభా దామాషా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టొద్దని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్లను ఏర్పాటు చేసినట్లే దక్షిణాదికి అవకాశం ఇవ్వాలి.
✳️ మంచి ప్రగతి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లలో మంచి వాటా ఇవ్వడం ద్వారా ఇతర రాష్ట్రాలు ఆర్థిక వృద్ది, సుపరిపాలనపై దృష్టి సారించేలా చేయాలి.
▶️ ప్రధాన డిమాండ్లు
✳️ 543 సీట్లు ఉన్న లోక్సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130. ఇది మొత్తం సీట్లలో 24 శాతం. పునర్విభజన తర్వాత ఏర్పడే నూతన లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు ఇవ్వాలి.
✳️ దేశవ్యాప్తంగా 50 శాతం సీట్లను పెంచాలనుకుంటే అలా పెరిగే 272 సీట్లతో మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య 815 అవుతుంది. ఇందులో 33 శాతం అంటే దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్లు 272 గా ఉండాలి. ఈ సీట్లను దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలకు ఇప్పుడున్న ప్రొరేటా ప్రాతిపదికన పంచవచ్చు.
✳️ దేశంలో మిగిలిన సీట్లను ఉత్తరాది, ఇతర రాష్ట్రాలకు కేంద్రం పంచవచ్చు. అనుకున్న దానికంటే దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గిస్తే అది దేశ రాజకీయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
