రాష్ట్రమంత్రివర్గ కూర్పుల్లో బీసీలకిచ్చిన చోటేది: ఎం.పి.వద్దిరాజు రవిచంద్ర

On
రాష్ట్రమంత్రివర్గ కూర్పుల్లో బీసీలకిచ్చిన చోటేది: ఎం.పి.వద్దిరాజు రవిచంద్ర

రాష్ట్రమంత్రివర్గ కూర్పుల్లో బీసీలకిచ్చిన చోటేది: ఎం.పి.వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్ సెప్టెంబర్ 11:
ఇంట్లోని బిడ్డలకు ఎంత ఆహారం అవసరమో లెక్కకట్టి తల్లి వంట చేస్తుంది. కుటుంబ నిర్వహణకు ఖర్చుల లెక్కలు తల్లిదండ్రులిద్దరు చూస్తారని, అదేవిధంగా ప్రజలందరి సంక్షేమం చూసే ప్రభుత్వం తల్లిదండ్రుల లెక్కన సమాజంలో సగభాగమైన బీసీల లెక్కలెందుకు చూడరని రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ రాసిన ‘‘కులగణన, రిజర్వేషన్లు - శాస్త్రీయ అవగాహన’’ అన్న పుస్తకాన్ని బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జస్టిస్ ఈశ్వరయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బీసీలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అనుభవిస్తున్న బాధలు, నైరాశ్యం, కష్టాలను ప్రొఫెసర్ లక్ష్మణ్ తన పుస్తకంలో చక్కగా విశ్లేషించారన్నారు. పద్మవ్యూహంలో చిక్కుకున్న బీసీలు అందులోంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషించుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ పుస్తకాన్ని బీసీల రాజ్యాంగంగా భావించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరముందన్నారు. బీసీలకు దక్కాల్సిన న్యాయమైన హక్కులు, వాటాలపై అవగాహన కల్పిస్తూ సభలు, సమావేశాలు విస్తృతంగా జరుపుకోవాలని సూచించారు. బీసీల సమస్యల సాధనకు బీసీ బిడ్డగా పార్లమెంటులో కొట్లాడుతానని చెప్పారు. మహిళాబిల్లు ఆమోదంలో బీఆర్ఎస్ కీలకభూమిక పోషించిందన్నారు. 
తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పులో ఇద్దరే బీసీ మంత్రులున్నారని, మున్నూరు కాపు, ముదిరాజ్, యాదవ, మైనార్టీలు తదితర బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం ఎందుకు లేదని వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. మేమెంతో మాకంత అన్న మార్గంలో బీసీ జనాభాకనుగుణంగా మంత్రివర్గ కూర్పులో స్థానాలుండాలన్నారు. బీసీలు 60 శాతం దాకా ఉంటే 42 శాతం ఎట్లా ఇస్తారని మా వాటా మాకే ఇవ్వాలని వద్దిరాజు డిమాండ్ చేశారు.

బీసీలు ప్రశ్నించనంతకాలం ఇంతే: కే.కేశవరావు
తమ వాటా తమకివ్వాలని ఎంతకాలమైతే బీసీలు అడగరో అప్పటి వరకు బీసీలు ఇదే స్థితిలో కొనసాగుతారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు అన్నారు. బీసీలది కులఉద్యమం కాదని, ఇది ప్రజాస్వామ్య ఉద్యమమని పుస్తకం రచయిత లక్ష్మన్ రాశారని చెప్పారు. కులవృత్తుల ఉత్పత్తి శక్తులను కూలీలుగా మార్చారని అందుకే సమాజంలో అంతరాలు వచ్చాయన్నారు. 130 బీసీ కులాల వారున్నప్పుడు అందులో అన్ని బీసీ కులాలకెలా మంత్రిపదవులు పంపిణీ చేస్తారని విశ్లేషించారు. బీసీల రాజ్యం వచ్చేవరకు అధికారపంపిణీ  వీళ్ళ చేతుల్లో ఉండదన్నారు. మంత్రివర్గంలో ఇద్దరు బీసీలకే మంత్రిపదవులిచ్చారని వద్దిరాజు అడుగుతున్నారని ఇదే ఆవేదన ప్రతి బీసీ ఎదలో ఉందన్నారు. పిసిసి జనరల్ సెక్రటరీగా వున్నప్పుడు మావాటా మాకు 50 శాతం కావాలని అడిగినట్లు గుర్తు చేశారు. ఆగ్రహించి రాజీనామా చేసి బైటకు వచ్చానన్నారు. తన అరవై ఏళ్ళ రాజకీయ పార్టీ అనుభవంలో తిరగబడితే పని జరిగింది కానీ కోరుకుంటూ పోతే పని జరుగలేదన్నారు. ప్రభుత్వం కులగణన చేస్తే ఆ తర్వాత మా వాటా మేం తీసుకుంటామని ప్రతి బీసీ మదిలో ఉందని కేశవరావు అభిప్రాయపడ్డారు. 

బీసీ సమస్యల జెండానెత్తితే బీఆర్ఎస్ కు పూర్వ వైభవం: జస్టిస్ ఈశ్వరయ్య
కులగణన ఉద్యమాన్ని బీఆర్ఎస్ తన భుజస్కంధాలపై వేసుకుంటే బీఆర్ఎస్ కు తిరిగి పూర్వవైభవం వస్తుందని రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే బీసీల సమస్యల జెండా ఎత్తాలని తెలిపారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, తెలంగాణ రాష్ట్ర సలహాదారుడు కే.కేశవరావు మాట్లాడిన దానికి ఆయన సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. బీసీలకు అన్ని రంగాల్లో సమ భాగస్వామ్యం ఉండాలన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అన్నది ఎవరో ఇచ్చే భిక్ష కాదని, అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కులగణన జరగాలని తెలిపారు. తెలంగాణలోని ఆనాటి 14 సంస్థానాల్లో ఆధిపత్యం ఆధిపత్య కులాలదేనని బ్రిటిష్ కాలం నుంచి నేటి పాలకుల వరకు పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అగ్రకులాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయని వివరించారు. దేశంలో పెద్ద పెట్టుబడి దారుడైన ముఖేష్ అంబానీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో పేదవానికి కూడా అదే స్థాయిలో సమాన గౌరవం లభించాలని భారత రాజ్యాంగం చెబుతుందని తెలిపారు. బీసీలు చైతన్యంతో హక్కులను సాధించుకుంటే అగ్రకులాల వాళ్ళు రిజర్వేషన్లు అడిగేదశకు వస్తారని ఆ దిశగా బీసీ ఉద్యమాలు పదునెక్కాలని చెప్పారు. 130 బీసీ కులాలకు వర్గీకరణ జరిపి ప్రతి చిన్న కులానికి కూడా న్యాయం జరిగేలా చేయాలని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న బీసీ కులాలు ఎంబీసీలు, కింది కులాలను అక్కున చేర్చుకోవాలన్నారు. బీహారులో మాదిరిగా తెలంగాణలో కూడా 60 శాతం బీసీ కులాలకు సంబంధించిన సమగ్ర కుటుంబసర్వేలు జరపాలని ప్రభుత్వానికి తెలిపారు. బీసీ కులాలు, ఇతర కులాలందరికీ సంబంధించిన జీవన విధానం తెలుసుకునేందుకు 100 అంశాలు పెట్టుకుని బీసీ కులగణన సర్వే చేయాలని సూచించారు. అన్ని రంగాల్లో మాదిరిగానే న్యాయస్థానాలలో కూడా బీసీలకు న్యాయం జరగటం లేదన్నారు. బీహార్ లో 40 శాతం నుంచి 65 శాతానికి రిజర్వేషన్లు పెంచితే పాట్నా హైకోర్టు కొట్టివేసిందని, దీనిపై తాను సుప్రీంకోర్టుకు అప్పీలుకు పోయానని జస్టిస్ ఈశ్వరయ్య తెలియజేశారు. 
తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ బీసీ ఉద్యమానికి బీసీ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, విద్యావంతులు పాలు పంచుకుని కులగణన ఉద్యమానికి మార్గదర్శకులు కావాలని కోరారు. పుస్తకరచయిత జి.లక్ష్మణ్ మాట్లాడుతూ పుస్తకంలోని అంశాలను విశ్లేషించి చెప్పారు. ఈ కార్యక్రమానికి సామాజిక ఉద్యమకారుడు రౌతు కనకయ్య అధ్యక్షత వహించగా విద్యుత్ బీసీ ఉద్యమ సంఘం నేత దేవుళ్ళ సమ్మయ్య, ఆకుల రజిత్, సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్, వనమాల చంద్రశేఖర్, ఉస్మానియా అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డి. మనోహర్ లు మాట్లాడారు,మున్నూరుకాపు సంఘం ప్రముఖులు సర్థార్ పుటం పురుషోత్తమ రావు,ఆవుల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags