మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం - "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ"   వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్

On
మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం -

మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం
- "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ"  
వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్

హైదరాబాద్ జనవరి 28:
రాష్ట్రంలోని జలాశయాలన్నింటిలో సౌరశక్తి ఆధారంగా నీటిపై తెలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త ఆలోచన రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల భవిష్యత్తుపై మరణ శాసనం అవుతుందని, ఈ ప్రతిపాదనలను బెషరతుగా విరమించుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతిపాదనల వల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు, "తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్" మాజీ చైర్మన్ శ్రీ పిట్టల రవీందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఇటీవల "పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ" (రెడ్ కో) కార్యకలాపాలపై హైదరాబాదులో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడాన్ని "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు.
తెలంగాణలోని వివిధ జలాశయాలకు చెందిన మత్స్యకార ప్రతినిధులు, తెలంగాణ ఫిషరీస్ సొసైటీ నాయకుల తో కూడిన ప్రతినిధుల బృందం ఆదివారం నాడు ఎన్టీపీసీ రిజర్వాయర్లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన అనంతరం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పిట్టల రవీందర్ మాట్లాడుతూ గతంలో కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని ప్రతిపాదించిందని అయితే అందువల్ల ఉత్పన్నమయ్యే సామాజిక మరియు పర్యావరణ సంబంధమైన సమస్యలపై తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలను మన్నించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సదరు ప్రతిపాదనలను పక్కకు పెట్టిందని గుర్తుకు చేశారు.

ప్రకృతిలో అందుబాటులో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను మానవ సంక్షేమానికి వినియోగించుకునే విషయంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీకి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ రిజర్వాయర్లలో సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి తీవ్రమైన ఆటంకాలు తలెత్తే ప్రమాదాన్ని నిలువరించడం కోసం మాత్రమే తాము ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నట్లు శ్రీ పిట్టల రవీందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుమారు 159 రిజర్వాయర్లలో సుమారు నాలుగు లక్షల మంది మత్స్యకారులు తమ జీవనోపాధిని పొందుతున్నారని, ఈ రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ మత్స్యకారుల చేపల వేటకు తీవ్రమైన ఆటంకాలు తలెత్తుతాయని, రిజర్వాయర్లలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే సోలార్ ప్లేట్లు జలాశయంలోని అతి ముఖ్యమైన ప్రాంతాలలో ఆవరించి ఉండటం వల్ల ఆయా ప్రదేశాలలో చేపల వేటను నిషేధిస్తారని, ఈ పరిణామాలు మత్స్యకారుల జీవన స్థితిగతులపైన, ఆదాయ వనరులపైన, సామాజిక భద్రతపైన ప్రతికూల ప్రభావాలను తీవ్రస్థాయిలో చూపిస్తాయని ఆయన తన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన మరియు ప్రజాపాలనను అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక జనాభా సంఖ్యను కలిగి ఉన్న మత్స్యకార సామాజిక వర్గాలకు ఇబ్బంది కలిగించే ఇట్లాంటి ఆలోచనలు ముందుకు తీసుకు రావడం తీవ్ర అభ్యంతరకరమని శ్రీ పిట్టల రవీందర్ ఆక్షేపించారు.
ప్రపంచంలోని అభివృద్ధి చెందిన అనేక దేశాలలో నీటిపై తేలే ఆడే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బదులుగా జలాశయాలకు అనుబంధంగా నిర్మించిన ప్రధాన కాలువల పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిల కలుపుతున్నారని ఈ టెక్నాలజీ ఇప్పటికే అనేక దేశాలలో విజయవంతం అయ్యిందని ఇదే పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలో కూడా అనుసరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణలోని రిజర్వాయర్లకు అనుబంధంగా సుమారు 30 వేల కిలోమీటర్ల పొడవు కలిగిన పంట కాలువలు ప్రధానా నీటి కాలువలు అందుబాటులో ఉన్నాయని, ఈ కాలువలను వినియోగించుకోవడం ద్వారా వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని శ్రీ పిట్టల రవీందర్ సూచించారు. అందువల్ల రాష్ట్రంలోని రిజర్వాయర్లలో చేపల పెంపకం మీద ఆధారపడిన లక్షలాదిమంది మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలిగించే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
"తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ విట్టల రవీందర్ తో పాటు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాల కనకయ్య ముదిరాజ్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి చంద్రశేఖర్ ముదిరాజ్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ వేల్పుల సరోజన, మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రతినిధులు దుద్దెడ గణేష్  ముదిరాజ్, మేడమైన కనకయ్య ముదిరాజ్, లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్ ప్రతినిధి అట్ల అనిల్ ముదిరాజ్, ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రతినిధి తోకల రాజేందర్ గంగపుత్ర, తదితరులు కూడా హాజరయ్యారు.

Tags