నల్లజెండాలతో ఎమ్మార్పీఎస్ ర్యాలీ - ఉద్రిక్తత - మందకృష్ణ అరెస్ట్
ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్
నల్లజెండాలతో ఎమ్మార్పీఎస్ ర్యాలీ
ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్
అడ్డుకున్న పోలీసులు – రాళ్ళు రువ్వడంతో ఉద్రిక్తత - మందకృష్ణ అరెస్ట్
సికింద్రాబాద్, అక్టోబర్ 09 (ప్రజామంటలు) :
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా చేస్తుందని ప్రశ్నిస్తూ... ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అద్యక్షుడు మందకృష్ణమాదిగ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన నల్ల జెండాల ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పార్శీగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు డప్పు చప్పుళ్ళతో ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. అయితే ర్యాలీని మార్గమద్యంలో పోలీసులు అడ్డుకోవడంతో కొందరు కార్యకర్తలు పోలీసులపైకి రాళ్ళు రువ్వారు.
దాంతో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తత పరిస్తితుల మద్య కాసేపు తోపులాట జరిగింది. ఈక్రమంలో పోలీసులు మందకృష్ణ మాదిగ తో సహా కార్యకర్తలను అరెస్ట్ చేసి బొల్లారం, బండ్లగూడ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఈసందర్బంగా మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నది ముమ్మాటికీ ద్రోహమే అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉపాద్యాయ ఉద్యోగాల భర్తీ చేయడం అనేది మాలలకు ఉద్యోగాలన్నీ దోచి పెట్టే కుట్ర అని విమర్శించారు. ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం రేవంత్ రెడ్డికి లేదన్నారు. మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలకు నమ్మక ద్రోహం చేయడం దారుణమన్నారు.
ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే 11 వేల టీచర్ పోస్టులలో 1250 పోస్టులు మాదిగ నిరుద్యోగులకు లభించేవన్నారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ లేకుండా చేసిన భర్తీలో కనీసం 400 పోస్టులు కూడ మాదిగలకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని, అవసమైతే ఆర్డినెన్స్ తీసుకువస్తామని చెప్పిన సీఎం నేడు మాట తప్పారన్నారు. 2004 లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రద్దు చేస్తే ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు లోకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 లో అదే సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్తే ఆ తీర్పును వెంటనే ఎందుకు అమలు చేయడం లేదని మందకృష్ణ ప్రశ్నించారు.
ఎస్సీ వర్గీకరణ అమలులోకి తీసుకొచ్చేంతవరకు ఉద్యోగ నియమకాలన్నీ నిలిపివేయాలని, కాలయాపన చేయకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలులోకి తేవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. అక్టోబర్ 15న ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల రాష్ర్ట కార్యవర్గ సమావేశం నిర్వహించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ర్ట అద్యక్షులు గోవింద్ నరేష్, ఎమ్మార్పీఎస్, ఎంజేఎఫ్ ఎంఎస్ఎఫ్ నాయకులు తిప్పారపు లక్ష్మన్, సోమశేఖర్, కార్తీక్, సుధాకర్, శ్రీనివాస్, డప్పు మల్లికార్జున్, కొమ్ము శేఖర్, విజయ్, మందరాజు, నరసింహారావు, సాంసంగ్, రాజు, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.
––––––––––––––––